అనిల్ అంబానీకి బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట
పన్నుల ఎగవేత వ్యవహారంలో నోటీసులు అందుకున్న రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ తేదీ నవంబర్ 17 వరకు ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టొదని ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది బాంబే హైకోర్టు. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్మనీ యాక్ట్ కింద ఐటీ శాఖ అనిల్ అంబానీకి పోయిన నెలలో షో కాజ్ నోటీసు జారీ చేసింది. స్విస్ బ్యాంకుల్లో ఆయనకు రెండు అకౌంట్లు ఉన్నాయని, ఆ వివరాలు దాచిపెట్టి సుమారు 420 కోట్ల రూపాయల్ని పన్నుల రూపంలో ఎగవేశారనే ఆరోపణ ఆయనపై ఉంది. ఈ నేరం గనుక రుజువైతే జరిమానాతో పాటు అనిల్ అంబానీకి గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.













