కేజ్రీవాల్ కు కేంద్రం షాక్.. సింగపూర్ పర్యటనకు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటన రద్దవడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై ఆప్ విరుచుకుపడింది. కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు కేంద్రం క్లియరెన్స్ ఇవ్వలేదని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆగస్టు తొలి వారంలో సింగపూర్లో జరిగే ప్రపంచ నగరాల సదస్సుకు కేజ్రీవాల్కు ఆహ్వానం అందింది. జులై 20 నాటికి సింగపూర్ పర్యనటకు అవసరమైన లాంఛనాలను ఢిల్లీ ప్రభుత్వం పూర్తి చేసింది. జులై 21న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ఫైల్ను తిప్పి పంపారు.
ఆఫై ఎల్జీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభించడంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ఇతర లాంఛనాలను పూర్తి చేసేందుకు సమయం లేకుండా పోయిందని ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
అంతర్జాతీయ సదస్సుకు అరవింద్ కేజ్రీవాల్ వెళ్లలేకపోవడం ఢిల్లీ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి తేటతెల్లం చేస్తోందని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపింది. జూన్ 7న సీఎం సింగపూర్ పర్యటన కోసం ఎల్జీ అనుమతి కోరామని ఒకటిన్నర నెల పాటు ఎల్జీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా జులై 21న తిప్పి పంపారని ప్రకటన ఆక్షేపించింది. అప్పటికి చాలా జాప్యం జరగడంతో పాటు పర్యటనకు అవసరమైన లాంఛనాలను పూర్తి చేసేందుకు డెడ్లైన్ జులై 20 కూడా దాటిపోయిందని తెలిపింది.













