కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి కాగానే.. సీఏఏ అమలు
దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోవిడ్-19 టీకాల పంపిణీ పూర్తవగానే పౌరసత్వ చట్టం అమలు చేస్తామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో పార్లమెంట్ హౌస్లో సమావేశమైన సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణల చట్టం (సీఏఏ) 2019 డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మత హింస తట్టుకోలేక 2014 డిసెంబర్ 31 నాటికి భారత్ చేరుకున్న ముస్లిమేతరులకు అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఏ భారతీయడికి పౌరసత్వం పోదని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఏఏకి వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. కుట్రతో రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం విమర్శించింది.













