టెక్సాస్ లో కార్చిచ్చు.. అణ్వాయుధ కార్యకలాపాలకు బ్రేక్
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కార్చిచ్చు రాజుకుంది. సోమవారం మొదలైన ఈ అగ్నిజ్వాలలు, ఒక్లహామా రాష్ట్రానికి కూడా పాకాయి. ఈ మంటల్లో అతి పెద్దదాన్ని స్మోక్హౌస్ క్రీక్ ఫైర్గా వ్యవహరిస్తున్నారు. ఇది బుధవారం నాటికి 5 లక్షల ఎకరాలకు విస్తరించినట్లుగా అధికారులు తెలిపారు. కార్చిచ్చు గ్రామీణ పాన్హండీల్కు చేరుకోవడంతో ముందు జాగ్రత్తగా అణ్వాయుధ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 60 కౌంటీలకు విపత్తు నిర్వాహణ హెచ్చరికను జారీ చేశారు. అమెరికాలో దాదాపు 11 మిలియన్ల మంది కార్చిచ్చు ముప్పునకు సమీపంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారుల పక్కన కూడా అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో వాటిని మూసివేశారు. బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్నిజ్వాలలు అయిదురెట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ ఆత్మీయులను రక్షించుకోవాలని రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ పిలుపునిచ్చారు.













