వర్క్ ఫ్రమ్ హోంపై గూగుల్ కీలక ప్రకటన
వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని వచ్చే ఏడాది వరకు పొడిగిస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. గూగుల్ క్యాంపస్లకు తిరిగి వచ్చే విషయంలో ఉద్యోగులకు జనవరి 10 వరకు స్వేచ్ఛనిస్తున్నామని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించుకునే విచక్షణాధికారాన్ని స్థానిక ఆఫీసులకు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా కార్యాలయాల్లో బిజినెస్ ఊపందుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా క్యాంపస్లకు తరలివచ్చే గూగుల్ ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నామన్నారు. రానున్న రోజులు ఊహించినదాని కంటే కొంత భిన్నంగా గడిచే అవకాశాలు ఉన్నప్పటికీ వచ్చే సవాళ్లకు సమష్టిగా ఎదుర్కొనే సామర్థ్యం గూగుల్కు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితంగా ఆఫీసులకు రావాలని కనీసం ఒక నెల రోజుల ముందే తెలియజేస్తామనని ఉద్యోగులకు పిచాయ్ హామీ ఇచ్చారు.
విశ్రాంతి కోసం డిసెంబరు, అక్టోబరులో కావాలంటే ఒక రోజు అదనంగా సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ సదుపాయాన్ని పొడిగిస్తున్నాయి. ఫేస్బుక్ ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, తాజాగా గూగుల్ సైతం అదే బాటలో పయనించింది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్ఫ్రం కొనసాగించాలని నిర్ణయించింది. డెల్టా వేరియంట్ విజృంభణకు తోడు ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు ఉద్యోగులు అయిష్టత చూపుతున్నందున ఇప్పటికే అమెజాన్, లైఫ్ట్ వంటి సంస్థలు వర్క్ఫ్రం హోంను కొనసాగిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాదిలో పరిస్థితులను బట్టి ఉద్యోగులు ఆఫీసులకు రావాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో గూగుల్ కూడా చేరింది.













