పాకిస్థాన్ చరిత్రలోనే అద్భుత ఘట్టం
పాకిస్థాన్ చరిత్రలోనే అద్భుత ఘట్టం ఆవిష్కృతమయింది. పాకిస్థాన్ సుప్రీం కోర్టులో తొలిసారి ఓ మహిళ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాహోర్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆయేషా మాలిక్కు పదోన్నతి కల్పించి సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమించేందుకు పాక్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) ఆమోదం తెలిపింది. తదుపరి ఈ సిఫార్సును పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తుంది. అక్కడ ఆమోద ముద్ర పడితే పాక్ సుప్రీం కోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా రికార్డు సృష్టిస్తారు. జేసీపీ సిఫార్సులను పార్లమెంటరీ కమిటీ తోసిపుచ్చడం చాలా అరుదు.
జస్టిస్ ఆయేషా పదోన్నతి అంశం గత ఏడాది సెప్టెంబరు 9న నాడు జేసీపీ పరిశీలనకు వచ్చింది. నాడు 4-4 ఓట్లతో సభ్యులు విడిపోవడంతో పదోన్నతి సిఫార్సు వీలు కాలేదు. పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపితే జస్టిస్ ఆయేషా 2031 జూన్ వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. 2030 జనవరిలో ఆమె పాక్ ప్రధాన న్యాయమూర్తిగాను బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది.













