భారత్ కు అన్ని వేళలా మద్దతుగా నిలుస్తాం : అమెరికా

భారత్లో కరోనా విజృంభణ ఉహించని స్థాయిలో పెరిగిపోతోన్న నేపథ్యంలో పలు దేశాల నుంచి ఇప్పటికే భారీగా సాయం అందిన విషయం తెలిసిందే. అమెరికా కూడా తమ వంతు సాయం అందజేస్తోంది. అమెరికాలోని పలు దిగ్గజ సంస్థలు భారత్కు పెద్ద ఎత్తున వైద్య పరికరాలు, ఆక్సిజన్ పంపుతున్నాయి. భారత్కు అన్ని వేళలా మద్దతుగా నిలుస్తామని వైట్హౌస్ మరోసారి తెలిపింది. తమ దేశ ప్రభుత్వంతో పాటు అమెరికాలోని కార్పొరేట్ సంస్థలు కూడా పెద్ద ఎత్తున భారత్కు విరాళాలు ఇచ్చాయని గుర్తు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో విరాళాలు అందుతున్నాయని తెలిపింది. ఈ విపత్కర సమయంలో భారత్తో కలిసి అగ్రరాజ్యం పనిచేస్తోందని వైట్ హౌస్ తెలిపింది.
జో బైడెన్ ప్రభుత్వం నుంచి 100 మిలియన్ డాలర్ల సాయం అందిందని చెప్పింది. అలాగే ప్రైవేట్ రంగం నుంచి మరో 400 మిలియన్ డాలర్లు విరాళంగా అందాయని ప్రకటించింది. భారత విదేశాంగ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపింది. అమెరికా నుంచి ఆరు విమానాల ద్వారా భారత్కు 20,000 మోతాదుల రెమిడెసివిర్ ఇంజక్షన్లు, 1,500 ఆక్సిజన్ సిలిండర్లు, 550 మొబైల్ ఆక్సిజన్ కాన్సస్ట్రేటర్లు, 10 లక్షల కరోనా ర్యాపిడ్ కిట్లు, సుమారు 2.5 మిలియన్ల ఎన్-95 మాస్కులు, పెద్ద మొత్తంలో పల్స్ ఆక్సిజన్ మీటర్లు, ఔషధాలు వంటివి పంపామని చెప్పింది.