ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్టు
ముంబయి పేలుళ్ల సూత్రధారుల్లో ఒకడైన లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జాకీ-ఉర్-రెహమాన్ లఖ్వీ అరెస్టయ్యాడు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తూ వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడన్న కేసులో పాకిస్థాన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. లాహోర్లోని సీడీటీ పోలీస్స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేపట్టి 61 ఏళ్ల లఖ్వీని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు. ముంబయి పేలుళ్ల కేసులో అరెస్టయిన లఖ్వీ.. 2015 నుంచి బెయిల్ పైనే ఉన్నాడు. అయితే, ముష్కర మూకలకు నిధులు సమకూరుస్తున్నడన్న ఆరోపణలు రావడంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన ఉగ్రవాద నిరోధక శాఖ (సీడీటీ) అతడిని అరెస్టు చేసినప్పటికీ..ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. లాహోర్ ఉగ్ర నిరోధక న్యాయస్థానంలో అతడిపై విచారణ జరుగుతుందని తెలిపారు. 2008 ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది క్షతగాత్రులైన ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసిన విషయం తెలిసిందే.













