గాంధీజీ మునిమనవరాలికి… ఏడేళ్ల జైలు శిక్ష

మహాత్మగాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్ ఫోర్జరీ కేసులో అరెస్టయ్యారు. డర్బన్ కోర్టు లతా రాంగోబిన్ను దోషిగా పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె 60 లక్షల రాండ్ (సుమారు రూ.3.22 కోట్లు)ల మేర మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమె 2015లో ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి ఆర్6.2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ గా తీసుకొని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చారు. దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని సదరు వ్యక్తి పేర్కొన్నారు. అయితే లతా రాంగోబిన్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఇన్వాయిస్లు ఫ్రాడ్ ఉందని, సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని తేలింది. అంతేగాక ప్రతీ డాక్యుమెంట్లోనూ భారత్ నుంచి మూడు కంటైనర్ల లినెన్ వస్తుందని చెప్పి ఆమె మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2015లో లతా గోబిన్కు వ్యతిరేకంగా ట్రయల్ ప్రారంభమైంది. కంపెనీని మోసం చేశారన్న అభియోగాలతో నేషనల్ ప్రోసిక్యూటింగ్ అథారిటీ ఆశిష్ లతాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తుంది. తాజాగా మరోసారి కోర్టులో విచారణకు రాగా.. ఈ కేసులో లతా రాంగోబిన్ దోషిగా తేలడంతో డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. తీర్పు, శిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదని కోర్టు తేల్చి చెప్పింది. కాగా దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ ఎంతో మంది పేదలకు న్యాయ సహాయం చేశారు. అయితే ఇప్పుడు గాంధీ పేరును ఆమె దిగజార్చేలా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.