ఇదో గొప్ప అవకాశం : కేంద్రం
జీ-20 దేశాలకు భారత్ నాయకత్వం వహించనుంది. ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న ఇండోనేషియా నుంచి డిసెంబరు 1న భారత్ బాధ్యతలు స్వీకరించనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్సైట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. జీ-20కి అధ్యక్షత వహించే అవకాశం గొప్పదని విదేశాంగ శాఖ పేర్కొంది. మోదీ ఆవిష్కరించనున్న లోగో, థీమ్ వెబ్సైట్లు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని, ప్రాధాన్యాలను ప్రతిబింబించేలా ఉంటాయని తెలిపింది. మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, ప్రధాని దార్శనికత వంటివి జీ-20 పగ్గాలు అందుకునేందుకు అవకాశం కల్పించాయని పేర్కొంది. జీ-20 పగ్గాలు చేపట్టాక వచ్చే ఏడాది దేశంలోని 32 ప్రాంతాల్లో 200 సమావేశాలను భారత్ నిర్వహించనుంది.













