వీసాల జారీల్లో భారత్ కే మా తొలి ప్రాధాన్యం : అమెరికా
వీసాల జారీల్లో భారత్కే తమ తొలి ప్రాధాన్యమని అమెరికా వీసా సేవల విభాగం డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టప్ట్ తాజాగా స్పష్టం చేశారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె పలు వివరాలను వెల్లడించారు. వీసాల విషయంలో భారత్తో ఉన్న పరిస్థితి నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం. కరోనా మహమ్మారికి పూర్వం జారీ చేసిన వీసాల కంటే ఈ ఏడాది 36 శాతం అధికంగా వీసాలను జారీ చేశాం. హెచ్1, ఎల్1 వీసాలకు అమెరికాలో రెన్యువల్ను ఈ ఏడాది ప్రారంభిస్తాం. వచ్చే శీతాకాలంలో దీనికి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తాం. వ్యాపారరీత్యా ఇతర దేశాలకు వెళ్తున్న భారతీయులు అక్కడి నుంచి కూడా అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. థాయ్ల్యాండ్, జర్మనీ వంటి దేశాల్లో ఈ సౌకర్యం ఇప్పటికే ఉంది అని జూలీ స్పష్టం చేశారు.













