చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడో బిడ్డను కూడా
చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో జననాల రేటు పడిపోతుండటంతో ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తున్నట్లు మే 31న ప్రకటించింది. ఒకే సంతానం విధానాన్ని దశాబ్దాలపాటు కఠినంగా అమలు చేయడంలో చైనాలో జనాభా పెరుగుదల క్షీణించింది. దీని కారణంగా తలెత్త దుష్ఫలితాలపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఇద్దరు బిడ్డల్ని కనవచ్చంటూ 2016లో వెసులుబాటు కల్పించింది. తాజాగా మరో అడుగు ముందుకేసి దంపతులు ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండేందుకు వీలు కల్పించింది.
కొత్త గణాంకాల ప్రకారం చైనాలో వరుసగా నాలుగో ఏడాది కూడా జననాల రేటు అతితక్కువగా నమోదైంది. ప్రపంచంలోనే అత్యధిక జనభా, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో పనిచేయగలిగే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో దేశాధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ అధినేత జిన్పింగ్ ఇప్పటి వరకు అనుసరించిన కుటుంబ నియంత్రణ విధానాన్ని పక్కనబెట్టి, దంపతులు మూడో బిడ్డకు కూడా కలిగి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.













