విమానాలపై నిషేధం ఎత్తేసిన కెనడా
భారత్ నుంచి వచ్చే విమానాలపై రేపటి నుంచి నిషేధం ఎత్తేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ నిషేదాన్ని కెనడా అమలు చేసింది. అప్పటి నుంచి ఐదు నెలలపాటు ఈ బ్యాన్ కొనసాగింది. ఇప్పుడు తాజాగా దీన్ని తొలగిస్తున్నట్లు కెనడా తెలిపింది. అయితే భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు అనుమతి పొందిన ల్యాబొరేటరీల నుంచి కరోనా నెగిటివ్ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని కెనడా సూచించింది. ఈ పరీక్షలకు ప్రయాణానికి 18 గంటల ముందు చేయించుకోవాలని చెప్పింది. కాగా, భారత్ నుంచి మూడు విమానాల్లో కెనడా చేరిన ప్రయాణికులు అందరూ కరోనా నెగిటివ్గా తేలారు. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.













