కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం ఎయిమ్స్ వైద్యుల బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఉపరాష్ట్రపతి తెలిపారు. కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్గా తేలినప్పటికీ ఆయనలో వైరస్ లక్షణాలేవీ కనిపించలేదు. అయితే వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధాన్ని పాటించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, అయితే వైద్యుల సూచనలను మరికొంతకాలం పాటు కొనసాగించడం మంచిదని ఇంటి నుంచే జాగ్రత్తలు పాటిస్తూ పనిచేయాలని భావిస్తున్నాట్లు తెలిపారు.
స్వీయ నిర్బంధ కాలంలో తన ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేసిన ప్రజలు, అభిమానులు, వివిధ పార్టీల నేతలు, కులాలు, మతాలకు అతీతంగా తాను కోలుకోవాలని ఆకాంక్షించి, ప్రార్థనలు చేసిన వారందరి ప్రేమాభిమానాలకు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు చెప్పారు. కరోనా సంక్రమణ కాలంలో ఆరోగ్య సేవలు అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తనకు తోడుగా అన్ని వేళలా సేవలు అందించిన వ్యక్తిగత సహాయకులకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పారు.






