జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం : కేంద్రం

కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో భాగంగా తొలుత దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 27 కోట్ల మంది 50 ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వారికి అందించనున్నట్లు పేర్కొంది. వచ్చే వారం మకర సంక్రాంతి, లోహ్రి, మగ్ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించాం అని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్ వ్యాక్సిన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష జరిపిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది.