కోవిడ్19 కట్టడిలో వైఫల్యం ఎవరిది?
అమెరికాలో ఎన్నోరకాల వైరస్లను కట్టడి చేసిన ప్రఖ్యాత వైద్య సంస్థ ‘సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)’ సంస్థ నేడు కరోనా కట్టడి విషయంలో ఎందుకు వైఫల్యం చెందిందో ఎవరూ ఇతమిత్తంగా చెప్పలేకపోతున్నారు. దీనివెనుక కొన్ని శక్తుల ప్రమేయమే కారణమని చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం కోవిడ్ 19పై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు సిడిసిని వైఫల్యదిశగా నడిపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచం ఎదురొన్న ఎన్నో మహమ్మారులను అమెరికాలో కట్టడి చేసిన సిడిసి కోవిడ్ విషయంలో మాత్రం ఎందుకు మొదటినుంచి జాగ్రత్తగా వ్యవహరించలేకపోయిందన్న విషయంలో పలు వార్తలు వినవస్తున్నాయి. అందులో ఒకటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి సిడిసి ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందని అంటున్నారు. స్మాల్ పాక్స్ (తట్టు), అమెరికాలో పోలియోను సమూలంగా నిర్మూలించి ప్రజారోగ్య వ్యవస్థలో స్వర్ణ ప్రమాణంగా నిలిచి ప్రపంచ దేశాల నీరాజనాలందుకున్న సీడీసీ సంస్థ కోవిడ్ విషయంలో పెద్దగా ఏమీ చేయలేని స్థితికి ఎందుకు దిగజారిందో అని అందరూ కారణాలు అన్వేషించారు.
సీడీసీలో 30 ఏళ్ల అనుభవం కలిగిన ప్రముఖ అంటు రోగాల నిపుణులు జాయ్ బట్లర్ ఏం చేస్తున్నారు? అంటు రోగాల ఆటకట్టించడంతోపాటు వాటి మూలాలను కనిపెట్టడంలో మంచి తెలివి తేటలు కలిగిన బట్లర్ సేవలు ఎందుకు అందుబాటులో లేవు? అమెరికాపై ఆంథ్రాక్స్ దాడి దర్యాప్తులో ఎఫ్బీఐకి ఆయన అందించిన సహకారం, హెచ్1ఎన్1 ఫ్లూకు వ్యాక్సిన్ పంపిణీలో ఆయన సేవలు మరువ లేనివి. అలాంటి వ్యక్తి సీడీసీకి అందుబాటులో ఉండగా, కరోనా వైరస్ కట్టలుతెంచుకొని ఎందుకు పెరుగుతోంది? సీడీసీ చరిత్రలో 2020 సంవత్సరం చీకటి అధ్యాయంగా మారింది. ఈ?సంస్థ కార్యకలాపాల్లో అణువణువున దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం జోక్యం చేసుకోవడం వల్లనే కరోనా వైరస్ను నిలువరించడంలో సీడీసీ ఏం చేయలేక చేతులెత్తేయాల్సి వచ్చిందని బట్లర్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లాక్డౌన్ను అమలు చేయడంలో, వాటిని ఎత్తివేయడంలో సీడీసీ నిర్దేశించిన ప్రమాణాలను, ప్రతిపాదనలను అధ్యక్ష భవనం పూర్తిగా కాలరాసిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి నిబంధనలు లేకుండానే దేశంలోని ప్రార్థనా మందిరాలన్నింటినీ తెరచుకునేందుకు అధ్యక్ష భవనం అనుమతించిందని ఆరోపించాయి. దానికితోడు కరోనా వైరస్ పట్ల మొదటి నుంచి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తు వచ్చినా ట్రంప్ ప్రవర్తనను, తాము వ్యక్తిగత వ్యవహారమని సరిపెట్టుకున్నామని, అదే చివరికి దేశం పాలిట ప్రాణాంతకం అవుతుందని భావించలేదని సీడీసీ వర్గాలు పేర్కొన్నాయి.
‘కరోనా నన్నేమీ చేయలేదు’ అంటూ మొదటి నుంచి మాస్క్ కూడా ధరించని ట్రంప్, చివరకు తనతోపాటు భార్యకు కూడా కరోనా రావడంతో తొలి సారిగా మాస్క్ ధరించిన విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం సీడీసీ డైరెక్టర్గా ట్రంప్ నియమించిన రాబర్ట్ రెడ్ ఫీల్డ్, ఆఫీసు రాకుండా రోజు అధ్యక్ష భవనంకు వెళ్లి అక్కడ హాజరు వేయించుకునేవారనే విమర్శలు కూడా గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. చైనాలోని వూహాన్ నగరంలో కొత్త రకం నిమోనియా కేసులు వచ్చిన విషయాన్ని చైనా తర్వాత గుర్తించిన శాస్త్రవేత్తల్లో సీడీసీ సీనియర్ శాస్త్రవేత్త అన్నే షూచాట్ ఒకరు. 2003లో సార్స్ మూలాలను కనుగొనేందుకు ఆమె చైనా వెళ్లారు. అంటు రోగాలపై ప్రజాదరణ పొందిన ‘కంటేజియస్’ హాలివుడ్ చిత్రంలో కేట్ విన్సిలేట్ పాత్రకు అన్నే షూచాట్యే స్ఫూర్తి. వుహాన్లో అంతు చిక్కని నిమోనియా కేసులను పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ 2019, డిసెంబర్ 31 ఉదయం 8.25 గంటలకు బట్లర్తోపాటు ఇతర సహచరులకు షూచాట్ ఈ మెయిల్ పంపించారు.ఆ తర్వాత వారంతా సమావేశమై కొత్త వైరస్ గురించి చర్చించారు. అప్పటికే చైనాలో 27 కేసులు బయట పడినట్లు గుర్తించారు. దేశాధ్యక్ష భవనాన్ని కూడా హెచ్చరించారు. అధ్యక్ష భవనం వారిని పట్టించుకోక పోవడమే కాకుండా, దాన్నో రాజకీయ వ్యవహారంగా చూసింది. పర్యవసానమే సీడీసీ వైఫల్యమని బట్లర్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను, విమర్శలను సీడీసీని పర్యవేక్షించే ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్’ అధికార ప్రతినిధి ఖండించారు.






