ఆర్ధికనష్టాలు…కరోనాకష్టాలు.. – కింకర్తవ్యం ఏమిటి? కేంద్రం కీలక భేటీ
వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. కొండనాలుకకు మందేస్తే అది తగ్గకపోగా ఉన్న నాలుక ఊడే పరిస్థితి దాపురించింది. మన దేశంలో ఇప్పుడు నెలకొన్నిసంక్షోభం మున్నెన్నడూ ఎరుగనిది. రెణ్నెళ్లుగా దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. కరోనాని కట్టడి చేయాలని లాక్ డవున్ విధిస్తే.. వైరస్ నియంత్రణ సాధ్యం కాకపోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష అంకెను దాటేసింది. మరో రెండు, మూడు నెలల దాకా కరోనా ఉధృతి మరింతగా కొనసాగనున్నట్లు అంఛనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తప్పనిసరి పరిస్థితిలో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశం ఆర్థికంగా కుంగిపోయింది. ఈనేపధ్యంలో మే 20వ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ పరిస్థితులను, కరోనా వ్యాప్తిలో పెరుగుతున్న వేగం వంటి అంశాలను చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
ఉత్సాహమివ్వని ఉద్దీపన…
దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ఉద్దీపనలను ప్రకటించింది. రంగాల వారీగా ప్యాకేజీలను వెల్లడించింది. అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన ప్యాకేజీలతో లాభం లేదన్న అభిప్రాయాన్ని విపక్షాలతోపాటు కొన్ని న్యూట్రల్ రాజకీయ పార్టీలు సైతం తప్పుపడుతున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రకటించిన ప్యాకేజీని పచ్చిమోసంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్థిక ప్యాకేజీపై పెదవి విరవగా.. పలు విదేశీ మీడియా సంస్థలు తమ విశ్లేషణల్లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని డొల్ల ప్యాకేజీగా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీపై వచ్చిన ఫీడ్ బ్యాక్పై కేబినెట్ సమావేశం చర్చించనున్నట్లు తెలుస్తోంది.
లోకల్ రైళ్లూ..విమానాలపైనా…
ఇక కరోనా వైరస్ నియంత్రణా చర్యలను, వలస కార్మికుల తరలింపు కారణంగా ఉత్పన్నమైన పరిణామాలను కేబినెట్ చర్చించే ఛాన్స్ వుంది. రోడ్డు రవాణాకు దాదాపుగా ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్… రైలు, విమానయానంపై మాత్రం మే 31వ తేదీ దాకా నిషేధం కొనసాగిస్తోంది. అయితే, డొమెస్టిక్ విమానాలను నడపాలన్న డిమాండ్ బలపడుతున్న తరుణంలో రేపటి కేంద్ర కేబినెట్ భేటీలో ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రైళ్ళ విషయంలోను కొనసాగుతున్న కొన్ని పరిమితులను మరింత సరళీకరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే పరిస్థితి కనిపిస్తోంది.






