ఇతర దేశాలతో పోలిస్తే మనమే ముందున్నాం

దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 33 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పక్రియలో ఇతర దేశాలతో పోలిస్తే మనమే ముందున్నాం. 30 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి అమెరికా లాంటి దేశాలకు 18 రోజులు పట్టగా భారత్ కేవలం 14 రోజుల్లోనే ఆ మార్క్ ను చేరుకోవడం విశేషమని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. టీకా పంపిణీలో దేశవ్యాప్తంగా మరో 4,40,681 మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో జనవరి 29 నాటికి దేశంలో మొత్తంగా 33,68,734 మంది టీకా తీసుకున్నట్లు వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు కేవలం 231 మందికి మాత్రమే టీకా వేయించుకున్నాక స్వల్ప దుష్ఫలితాలు ఎదురైనట్లు పేర్కొంది. భారత్లో 14 రోజుల్లోనే 30 లక్షల మందికి పైగా టీకాలు అందించడం విశేషం. ఇజ్రాయిల్లో 33 రోజులు, యూకేలో 36 రోజుల్లో 3 మిలియన్ల మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
టీకా పంపిణీ అత్యధికంగా జరిగిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ముందుంది. అక్కడ 4,31,879 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కర్ణాటకలో 3,07,752 మంది, మహారాష్ట్రలో 2,57,173, మధ్యప్రదేశ్లో 2,22,193, పశ్చిమ బెంగాల్లో 2,20,356, గుజరాత్ 2,16,004, ఆంధప్రదేశ్లో 1,77,856, కేరళలో 1,35,832 బిహార్లో 1,10,381 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.