అమెరికా మధ్యంతర ఎన్నికలో ప్రవాస భారతీయులు!
అమెరికాలో ప్రవాస భారతీయుల ప్రాబల్యం క్రమేపీ పెరుగుతోంది. ఆ దేశ జనాభా (32.57 కోట్లు)లో వారి సంఖ్య ఒక శాతమే అయినప్పటికీ మంగళవారం జరుగనున్న మధ్యంతర ఎన్నికల్లో 100 మంది ప్రవాసులు బరిలో ఉండడం గమనార్హం. ప్రతినిధుల సభకు 12 మంది భారతీయ అమెరికన్లు గట్టి పోటీ ఇస్తున్నారు. వీరిలో గత ఎన్నికలో గెలిచిన అమీబెరా (కాలిఫోర్నియా-7), రోఖన్నా (కాలిఫోర్నియా|17) రాజా కృష్ణమూర్తి (ఇలినాయిస్-8), ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్ రాష్ట్రం-7) ప్రముఖులు. మంగళవారం జరిగే ఎన్నికల్లోనూ వీరు సునాయాసంగా గెలుపొందుతారని సర్వేలు చెబుతున్నాయి. ఈ నలుగురూ సమోసా కాకస్ సభ్యులు కూడా. ప్రవాస నేతల కోసం కృష్ణమూర్తి, ఈ కాకస్ను ఏర్పాటు చేశారు. హిరాల్ తిపిర్నేని (అరిజోనా-8), శ్రీ ప్రెస్టన్ కులకర్ణి(టెక్సాస్-22), అఫ్తాబ్ పురేవల్ (ఒహాయో-1) కూడా ప్రత్యర్థులకు గట్టి పోటీఇస్తున్నారు. వీరందరూ డెమోక్రాటిక్ పార్టీ తరపున బరిలో నిలిచారు.













