అమెరికాలోని శ్రీవారికి వజ్రాలతో ఆభరణాలు
శిల్పకళల్లో ఖండాంతర ఖ్యాతిని పొందిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అక్కల సోదరుల్లో ఒకరైన కళారత్న అక్కుల శ్రీరామ్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం క్యారీ నగరంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామికి వజ్రాభరణాలను రూపొందించారు. ఆలయ నిర్వాహకుల ప్రతిపాదనల మేరకు స్వామివారికి కఠి హస్తము, వరద, శంఖు, చక్ర హస్తములు, పాదాలను వెండితో తయారు చేసి ముంబయి నుంచి తెప్పించిన అమెరికన్ వజ్రాలను వీటిలో పొదిగారు. ఈ ఆభరణాల రూపకల్పనకు తొమ్మిది నెలల సమయం పట్టిందని శ్రీరామ్ వెల్లడించారు. ఆభరణాలను అమెరికాకు పంపుతున్నట్లు తెలిపారు. త్వరలోనే అమెరికాలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వజ్ర కిరీటాన్ని కూడా తయారు చేయనున్నట్టు తెలిపారు. కాగా, ఆభరణాల్లో వాడిన వజ్రాల విలువ రూ.10 లక్షలు పైగానే ఉంటుందని తెలిపారు.













