ఎపి జన్మభూమి సేవలను మెచ్చుకున్న లోకేష్
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ఎపి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ లు ఇప్పటి వరకూ చేసిన సేవా కార్యక్రమాల గురించి మంత్రి నారా లోకేష్ ను కలిసి స్వయంగా వివరించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకూ 2400 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని, 100 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే విధంగా వివిధ చోట్ల 50 మహాప్రస్థానాలను కూడా అభివృద్ధిపరిచినట్లు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఎపి జన్మభూమి కార్యక్రమాలను మెచ్చుకుంటూ, ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా సమీక్షించేలా ప్రత్యేక డ్యాష్ బోర్డ్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఎన్ఆర్ఐలు నిధులు ఇచ్చిన నాటి నుండి 30 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని కూడా కోరారు. మహాప్రస్తానాల అభివృద్ధికి ఎన్నారైల నుంచి వచ్చిన నిధులతో పనులను 90 రోజుల్లోగా పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ఎన్నారైల ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తాను ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు ప్రతినెలా సమీక్షను జరపనున్నట్లు కూడా పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు ఎంతగానో సహకారం అందిస్తున్నారని, అభివృద్ధిలో వారు పాలుపంచుకుంటున్నందుకు వారికి అభినందనలను మంత్రి లోకేష్ తెలియజేశారు.













