రఘనందన్ కు ఫిబ్రవరి 23న మరణశిక్ష
శాన్వి అనే పది నెలల పాపను, ఆమె అమ్మమ్మను హతమార్చిన ఘటనలో ప్రవాసాంధ్రుడు యండమూరి రఘనందన్(32)కు ఫిబ్రవరి 23న మరణ శిక్షను అమలుపరచనున్నారు. భారతీయ అమెరికన్కు ఉరిశిక్ష విధించడం ఇదే ప్రథమం. అపహరించి, బెదిరించి, భారీ సంపద రాబట్టుకోవడానికే రఘనందన్ ఈ ఘాతాకానికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ప్రాణాంతక ఇంజక్షన్తో శిక్షను అమలు చేయనున్నప్పటికీ, మరణశిక్షలపై పెన్సిల్వేనియా గవర్నర్ టామ్వూల్ఫ్ విధించిన ఆంక్షల కారణంగా నిందితునికి కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 20 ఏళ్లలో ఒక్క మరణ శిక్షనూ పెన్సిల్వేనియాలో అమలు చేయలేదు. మరణశిక్షలపై అధ్యయనం చేసిన సలహా సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ చెందిన నిందితుడు కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ చదివి హెచ్-1బి వీసాపై అమెరికాకు వచ్చాడు. శిక్షను ప్రకటించగానే దానిపై అప్పీలుకూ వెళ్లినా, అక్కడ ఊరట లభించలేదు.













