ఇక ఆ సమస్య ఉండదు… హాయిగా నిద్ర పోండి
డొనాల్డ్ ట్రంప్, కిమ్ భేటీ అనుకున్నదాని కంటే అద్భుతంగా జరిగింది. ఒకరంటే ఒకరికి గిట్టని వీరిద్దరూ సింగపూర్ వేదికగా జరిగిన సమావేశంలో తమ మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు యత్నించారు. భేటీ ముగియడంతో ఇద్దరూ తమ దేశాలకు తిరుగు పయనమయ్యారు. బుధవారం ఉదయమే ట్రంప్ అమెరికాలో దిగారట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ, మరోసారి కిమ్తో తన భేటీ ఎలా జరిగిందో వివరించారు. ఇప్పుడే అమెరికాకు చేరుకున్నాను. సుదీర్ఘమైన యాత్ర. నేను అధ్యక్షుడిగా ఆఫీస్లో అడుగు పెట్టినప్పుడు ప్రజలు ఎంత సురక్షితంగా ఫీలయ్యారో ఇప్పుడు అంత కంటే ఎక్కువగా సురక్షితంగా ఉంటారు. ఇకపై ఉత్తర కొరియా నుంచి మనకు ఎలాంటి అణు ముప్పూ ఉండబోదు. కిమ్తో సమావేశం ఆసక్తిరంగా, సానుకూలంగా జరిగింది. ఉత్తర కొరియాకు మంచి భవిష్యత్తు ఉంది. నేను అధ్యక్షుడిగా కార్యాలయానికి రాక ముందు ప్రజలంతా మనం ఉత్తర కొరియాతో యుద్దం చేస్తామని అనుకున్నారు. ఉత్తర కొరియా నుంచి అమెరికాకు పెద్ద ముప్పు ఉందని అదే భయంకరమైన సమస్య అని మాజీ అధ్యక్షుడు ఒబామా చెప్పారు. కానీ ఇక ఆ సమస్య ఉండదు. ఈ రాత్రి హాయిగా నిద్ర పోండి అని ట్రంప్ పేర్కొన్నారు.













