Ustad Jhakeer Hussain: ఐసీయూలో జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమం హృద్రోగంతో అమెరికా ఆస్పత్రిలో చికిత్స
ఆయన ఇక లేరంటూ వదంతులు
ఆ వార్తల్ని ఖండించిన కుటుంబసభ్యులు, సన్నిహితులు
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్ పురస్కారగ్రహీత.. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73)(Ustad Jhakeer Hussain) ఆరోగ్యం విషమంగా ఉంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన రెండువారాలుగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం ఆయన పరిస్థితి విషమించిందని.. దీంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్సచేస్తున్నారని జాకీర్హుస్సేన్ ఆప్తమిత్రుడు రాకేశ్ చౌరాసియా (Rakesh Chorasiya) ఒక ప్రకటనలో తెలిపారు. అయితే.. జాకీర్ హుస్సేన్ ఇక లేరనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
కేంద్ర సమాచార, ప్రసారశాఖ సైతం.. జాకీర్ మృతిపట్ల సంతాపం తెలుపుతూ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు కూడా ‘ఎక్స్’ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన జాకీర్ మృతి వార్తను నమ్మవద్దని.. ఆయన జీవించే ఉన్నారని, కాకపోతే ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని ఆయన సోదరి ఖుర్సీద్ ఔలియా, మేనల్లుడు అమీర్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం కోసం అభిమానులందరూ ప్రార్థన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర సమాచార, ప్రసార శాఖ తన ట్వీట్ను డిలీట్ చేసింది.













