రానా, సాయిపల్లవి, వేణు ఊడుగుల ‘విరాటపర్వం’ విడుదల వాయిదా
రోజు రోజుకు కరోనా వ్యాప్తి తీవ్రం కావడం తో సినిమాలన్నీ వాయిదాలు వేసుకుంటున్నాయి తాజాగా రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ఒక యూనిక్ కాన్సెప్ట్తో రూపొందుతోన్న సినిమా ‘విరాటపర్వం` కూడా విడుదల వాయిదా వేసుకుంది. ఈ సినిమాలో ఇంతవరకూ చూడని సరికొత్త పాత్రలలో రానా, సాయి పల్లవి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్తో పాటు ఇటీవల విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ సాధించింది. 90వ దశకంలో జరిగిన యధార్ధ సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ `రవన్న` పాత్ర పోషిస్తున్నారు. అతను తన కలంపేరు `అరణ్య`గా ప్రసిద్ది. సాయి పల్లవి `వెన్నెల` అనే పాత్రలో అతని ఆరాధకురాలిగా కనిపించనుంది. ఒక అద్భుతమైన ప్రేమకథగా `విరాట పర్వం` తెరకెక్కుతోంది.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వ్యాప్తి (Spike in Covid-19) కారణంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన విరాటపర్వం సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నారు. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రివల్యూషన్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ లవ్” అనేది ట్యాగ్లైన్. డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సంయుక్తంగా సినిమాటోగ్రఫీ భాధ్యతలు నిర్వహిస్తున్నారు, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.













