‘మర్డర్ ని ఆపేయండి’ హైకోర్టును ఆశ్రయించిన అమృత : పిటిషన్ కొట్టివేత
నా జీవిత కథతో తెరకెక్కించిన ‘మర్డర్’ సినిమాను ఆపేయాలంటూ మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్ హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మర్డర్’ వివాదం మళ్లీ హైకోర్టుకు చేరింది. ఈ సినిమాను రేపు (డిసెంబర్ 24) విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో అమృత మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది.
‘మర్డర్’ సినిమా తన కథతోనే తెరకెక్కించిన ఆర్జీవీ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ అమృత తన పిటిషన్లో పేర్కొంది. దీన్ని లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించి విచారించాలని కోరింది. అయితే అమృత అభ్యర్థనను నిరాకరించిన హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేపారేసింది. రేపు సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత దీనిపై తాము విచారణ చేపట్టలేమని పేర్కొంది. వర్మ తెరకెక్కించిన ‘మర్డర్’ సినిమా.. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్-అమృత ప్రేమ, ప్రణయ్ హత్య నేపథ్యంలో తెరకెక్కిందని అమృత, ప్రణయ్ తల్లిదండ్రులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం సినిమాలో వారి పేర్లను ఎక్కడా వాడొద్దని షరతులు పెట్టి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.













