హిందీ ‘జెర్సీ’ ప్రాజెక్ట్ లో బిజీ గా వున్నాను రామ్ చరణ్ తో సినిమా పుకార్లే! దర్శకుడు గౌతమ్ తిన్ననూరి
మెగా పవర్స్టార్ రామ్ చరణ్, శంకర్ _దిల్ రాజు సినిమా తరువాత ‘జెర్సీ’ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు పొందింది దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో త్వరలో ఓ సినిమా చేయనున్నాడు అంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో ఈ వార్త చక్కర్లు కొడుతున్నాయి. ట్టయితే తాజాగా ఈ పుకార్లకు గౌతమ్ తిన్ననూరి చెక్ పెట్టాడు. రామ్ చరణ్తో తాను ఎటువంటి సినిమా చేయడం లేదని అతను క్లారిటీ ఇచ్చాడు. మెగాపవర్స్టార్ రామ్ చరణ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ రెండు మేజర్ ప్రాజెక్టుల తర్వాత స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమాలో నటిస్తున్నాడని ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పటికే గౌతమ్ చెర్రీకి కథ వినిపించగా.. అతను ఓకే చేశాడని టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలకు గౌతమ్ తిన్ననూరి చెక్ పెట్టాడు. తను రామ్ చరణ్తో సినిమా చేయడం లేదని అతను స్పష్టం చేశాడు. తను తెలుగులో ఏ హీరోకి కథ చెప్పలేదని అతను అన్నాడు. ప్రస్తుతం తాను జెర్సీ సినిమా హిందీ వర్షెన్ షూటింగ్ బిజీగా ఉన్నానని అతను పేర్కొన్నాడు. అంతేకాక.. తన వద్ద కొత్త కథలు కూడా ఏమీ సిద్ధంగా లేవని అతను అన్నాడు. కాగా, నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. పైగా జాతీయ స్థాయిలో అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ సినిమాని ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తుండగా.. మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.













