సాయి పల్లవిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్! బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్!!
కశ్మీర్ ఫైల్స్పై నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇంకా దూమారం రేపుతున్నాయి. ఆమెపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవిపై అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో అనుకోకుండా కశ్మీర్ ఫైల్స్పై నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగుతోంది. భజరంగ్దల్ నేతలు ఆమెపై మండిపడుతూ.. హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
అంతగా కేసు పెట్టేంత మాటలు సాయి పల్లవి ఏమంది ? విరాట పర్వం మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. “కొన్ని రోజుల క్రితం వచ్చిన కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు మనం మత సంఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్గా ఓ బండిలో ఆవుని తీసుకెళ్తున్నారు.. బండిలో డ్రైవర్ ముస్లింగా ఉన్నాడని కొంత మంది కొట్టేసి.. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది.. మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే.. ఇతరులను బాధించం.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు..” అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు చినికిచినికి గాలివానలా తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై త్వరలో స్పందిస్తానని సాయి పల్లవి ఇప్పటికే చెప్పింది.
తాను ఇప్పుడు ఏది మాట్లాడినా.. ‘విరాట పర్వం’ మూవీ ప్రమోషన్స్ కోసం మాట్లాడుతున్నానని అంటారని.. తరువాత వివరిస్తానని తెలిపింది. కాగా.. సాయి పల్లవిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా మాట్లాడిన సాయి పల్లవి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివి ఆమె మైండ్ పాడైందని.. వాస్తవాలు మాట్లాడే దమ్ము ఆమెకు లేదన్నారు. కశ్మీర్కు అక్కడ పండితులను కలిస్తే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. ఇలా ఏది పడితే అది మాట్లాడితే సహించేదిలేదని.. ప్రజలు తిరగబడి కొరతారని హెచ్చరించారు. ‘తెలంగాణతో పాటు ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్లో సాయి పల్లవిపై ఫిర్యాదు చేయండి. ఒకరిని అరెస్ట్ చేస్తే.. ఇక ఎవరూ హిందువుల జోలికి రాకుండా ఉంటారు. కొందరు పాపులర్ కావాలని ఇలా మాట్లాడుతున్నారు. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ముస్లిమ్ పైనా.. క్రిస్టియన్స్పైనా ఇలా కామెంట్ చేస్తారా..?’ అని రాజా సింగ్ ప్రశించారు. హిందువులు ఏం చేయరని కామెంట్స్ చేస్తే.. దాడులు తప్పవని హెచ్చరించారు.













