ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్
విశాఖ ఎయిర్పోర్టులో దాడికి గురై సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ శివారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి గాయం కారణంగా నొప్పితో జగన్ ఇబ్బందిపడటంతో పెయిన్ కిల్లర్ ఇచ్చామన్నారు. గాయం మానడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. కండరానికి, చర్మానికి కలిపి 8 కుట్లు పడ్డాయన్నారు. రక్తం నమూనాలను ల్యాబ్లకు పంపామన్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వైఎస్ జగన్ కొన్ని టెస్టులకు మళ్లీ రావాల్సి ఉంటుందన్నారు. టెస్టులన్నీ నార్మల్గా వచ్చి, గాయం మాని కుట్లు తీసే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.













