ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్, మజ్లిస్ కు ఉందా? కిషన్ రెడ్డి
2016 ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను టీఆర్ఎస్ ఇప్పటికీ అమలు చేయలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత మేనిఫెస్టోలోని అంశాలనే ఈసారి ఎన్నికల్లో పొందుపరిచారని అన్నారు. హైదరాబాద్ను విశ్వనగరం కాదు.. విషాద నగరం చేశారని మండిపడ్డారు. ఇటీవల హైదరాబాద్ వరదల్లో 40 మందికి పైగా చనిపోయారని అన్నారు. సెల్లూను, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత అని గతంలోనే చెప్పారు. తాగునీటి గోస తీరుస్తామని ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు. గత ఆరున్నరేళ్లుగా వరద నీటి నిర్వహణ పనులు సరిగా చేపట్టలేదు అని అన్నారు.
పాత బస్తీ నగర ప్రజల ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్, మజ్లిస్కు ఉందా? అని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ విస్తరణ, తక్కువ ధరలకే ప్రయాణం అని చెబుతున్నారని, ఎంఎంటీఎస్ పనులను రైల్వే చేపడుతుందని, కొంత వాటా రాష్ట్రం ఇస్తుందని తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు 98 శాతం పూర్తయ్యాయని, రాష్ట్రం వాటా ఇవ్వనుందునే ఎంఎటీఎస్ పనుల్లో జాప్యం తలెత్తిందని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ట్రాఫిక్ ఫ్రీ నగరం అని గొప్పలు చెబుతున్నారని, అలాంటి పరిస్థితులు నగరంలో ఉన్నాయో లేదో ప్రజలకే తెలియాలని అన్నారు. ఆరున్నరేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.













