తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. హైకోర్టు ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9:30 నుంచి మధ్యాహం 13:15 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిపరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్ను రూపొందించారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులందరూ భౌతిక దూరం పాటించేలా పరీక్ష హాల్లో చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతమున్న 2,530 పరీక్ష కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.













