విభజన హామీల కోసం జేఏసీ!
విభజన హామీలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ దోబూచులాడుతున్నాయి. నెపం ఒకదాని మీద మరొకటి వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. దీనిపై ప్రజల్లో విపరీతమైన ఆందోళన వ్యక్త మవుతోంది అని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. విభజన హామీల సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు కావాల్సిన అవసరం కనిపిస్తోందని, దీని కోసం తాను చొరవ తీసుకోనున్నట్లు వెల్లడించారు. హైదబాద్లోని జనసేన కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్కుమార్, లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణలాంటి మేధావులతో పాటు కలిసొచ్చేవారందరినీ కలుపుకొని ప్రెజర్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. దీని కోసం నేటి నుంచి ప్రయత్నాలు మొదలు పెడతాను. ఈ క్రమంలో కలిసివచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొనిపోతాను. సంస్థలను, స్వచ్చంద సంస్థలను భాగస్వాములను చేస్తానని అన్నారు. విభజన హామీలపై అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ ప్రజలను మభ్యపెడుతున్నాయన్న ఆయన, ప్రజలు తాము మోసపోయినట్లుగా భావిస్తున్నారన్నారు.













