యూఎస్ సదస్సుకు తెలంగాణ యువతి చందన

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ చందన యూఎస్ జ్యుడీషియల్ విధానం అనే అంశంపై అమెరికాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. మొత్తం 22 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మనదేశం తరపున తెలంగాణ నుంచి చందన ఎంపిక కావడం విశేషం. చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ ఉమెన్ రైట్స్ అనే అంశంపై ఆమె పోరాటాన్ని గుర్తించిన యూఎస్ ప్రతినిధులు చందనను ఆహ్వానించారు.
ప్రస్తుతం బచ్పన్ బచావో ఆందోళన్ లో స్టేట్ కో ఆర్డినేటర్గా చందన చురుగ్గా పని చేస్తున్నారు. చిన్న పిల్లలు, మహిళల కోసం యూఎస్ న్యాయవ్యవస్థలో ఉన్న అంశాలతో పాటు వివిధ దేశాల్లోని న్యాయ వ్యవస్థల్లోనూ ఏ విధంగా ఉన్నాయన్న అంశాలపైనా ప్రతినిధులకు నిర్వహించే పలు కార్యక్రమాల్లో తాను పాల్గొని చర్చించనున్నట్టు చందన తెలిపారు. అమెరికాలో ఏప్రిల్ 6 నుంచి 27 వరకు జరిగే ఆయా కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని తెలిపారు.