Revanth reddy: సంక్రాంతికి రైతు భరోసా… తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

రాష్ట్ర రైతులకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ తీపికబురు వినిపించింది. ఈనెలలోనే రైతుభరోసా నగదును ఇవ్వనున్నట్లు వెల్లడించింది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు
. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించిదన్నారు. ఈ మేరకు సబ్ కమిటీ రైతు భరోసా అమలు కోసం ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించనుంది.. రైతుల నుంచి జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూముల వివరాలు ధ్రువీకరించి, జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సాగు చేసే భూములకే రైతు భరోసా..
పంట పండించే ప్రతి రైతుకు రైతుభరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సాగులో లేని భూములకు రైతు భరోసా అందించకూడదని ప్రభుత్వం(Telangana government) భావిస్తోంది. ధరణి పోర్టల్ ప్రకారం 1.53 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తేల్చగా, సాగులో లేని భూములను తొలగించిన తరువాత 1.30 కోట్ల ఎకరాలకు భరోసా అందించే అవకాశం ఉంది.
సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భూముల గుర్తింపు:
రైతు భరోసా ప్రయోజనం నేరుగా సాగు చేస్తున్న రైతులకు అందేలా వ్యవసాయ అధికారులు ఫీల్డ్ సర్వే నిర్వహించనున్నారు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఖచ్చితమైన సాగు భూములను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రైతు భరోసా పై తుది నివేదిక అందించనున్నారు. ఈ చర్చల తరువాత, ఎల్లుండి క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసా పై తుది నిర్ణయం వెలువడనుంది.ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు మేలుచేయడం లక్ష్యంగా ఉన్నాయని, రైతు భరోసా పథకం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందనే నమ్మకం ఉందని మంత్రులు పేర్కొన్నారు.