నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి కొత్త తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30న దీన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. నూతనంగా నిర్మించిన సచివాలయానికి డా.బి.ఆర్ అంబేడ్కర్ పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17నే సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని తొలుత భావించినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో తాజాగా కొత్త తేదీని నిర్ణయించారు. మరోవైపు జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించనున్నారు. నూతన సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నిర్మాణ భవనం చుట్టూ కలియ తిరుగుతూ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించారు. తుది దశలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.













