రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు : సీఎస్ శాంతికుమారి

తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామైక్య సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్లాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బెంగాల్లోని దీదీ కా రసోయ్, కేరళలోని క్యాంటీన్లపై ఇప్పటికే అధ్యయనం చేసినట్లు సీఎస్ వివరించారు. వీటి నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళ శక్తి క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, అవసరమైన స్థలం తదితర వివరాలతో రోడ్ మ్యాప్ తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు.