తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. సెక్రటేరియట్ కూల్చివేత వివాదంపై ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ను కూల్చివేసి కొత్తది కట్టుకోవడానికి అనుమతించింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన కోర్టు కూల్చివేతకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లకు కొట్టివేసింది. క్యాబినెట్ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి అత్యాధునిక హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సచివాలయ కూల్చివేతకు వ్యతిరేకంగా పది పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని కోర్టుకు తెలిపింది. సచివాలయ నిర్మాణం అనేది విధాన పరమైన నిర్ణయమని, అందులో కోర్టు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మంత్రి మండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పిటిషన్లను కొట్టివేసింది.













