వచ్చే మూడేళ్లలో మరింత పటిష్ఠం చేయాలి : సీఎం రేవంత్

వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు. అంగన్వాడీ ప్లేస్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్వాడీల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్ను నియమించాలని కోరారు. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలి. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలి. ప్రభుత్వ సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు.