తెలంగాణలో బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్నలు, పెద్దలు, మహిళలు లయబద్ధంగా ఆట పాటలతో యావత్తు పల్లెలు, పట్టణాలు, నగరాలు సాయంత్రం పులకించిపోయాయి. ప్రపంచంలో మరెక్కడా లేని, తెలంగాణకే సొంతమైన బతుకమ్మ సంబరాలు ఈనెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పండుగ తొమ్మిది రోజుల అనంతరం ఈ నెల 28న జరిగే సద్దుల బతుకమ్మ నిమజ్జనతో ముగుస్తుంది. ప్రతీ ఏటా భాద్రపద అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమై అశ్వీయుజ నవమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ పండుగ పరిసమాస్తం అవుతుంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి బతుకమ్మ వేడుకలు స్ఫూర్తినివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తొలిసారి కోటి ఆరు లక్షల బతుకమ్మ చీరలను పంచడం ఈసారి వేడుకల్లో ప్రత్యేకత. ఈ నెల 26 మహా బతుకమ్మ వేడుక నిర్వహించడానికి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది మహిళామణులు మహా బతుకమ్మకు తరలివస్తారన్న అంచనతో ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బతుకమ్మ వేడుకల కోసం ప్రతీ జిల్లాకు ఐదు లక్షల రూపాయాలు ప్రభుత్వం కేటాయించింది. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ ప్రతీ రోజు సాయంత్రం చెరువు గట్టున ఉండే దేవాలయం వద్ద నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసే చెరువుల వద్ద ప్రభుత్వం రోడ్లు, లైటింగ్ సదుపాయాలను కల్పించింది. బతుకమ్మ పండుగకు ఇంతటి ప్రాచుర్యం రావడానికి దోహదం చేసిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎంపి కవిత బతుకమ్మ పండుగను మనుపటికన్నా విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.













