తెలంగాణ అభివృద్ధిలో టిడిఎఫ్ పాల్గొనాలి… హైదరాబాద్లో ఘనంగా టిడిఎఫ్ ప్రవాసీదివస్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం.. ఇకపై రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన భూమిక వహించాలని ప్రొఫెసర్ కోదండరాం కోరారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్) 7వ ‘ప్రవాసీ తెలంగాణ దివాస్’ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న టిడిఎఫ్ బృందాన్ని అభినందించారు. ఎన్నారై పాలసీ గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆయన విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో స్వేచ్ఛగా బతికే అవకాశం కలిగిందన్న కోదండరాం.. ఎన్ఆర్ఐ పాలసీపై ముందడుగు వేయాలని కోరారు.
అనంతరం మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి టిడిఎఫ్ వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్ధ చేస్తున్న సేవా కార్యక్రమాలను అయన కొనియాడారు. అనేక కార్యక్రమాల్లో తాను కూడా పాలుపంచుకున్నట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాలని ఆయన సూచించారు. దూర దేశాల్లో ఉన్నప్పటికీ సొంత ఊర్లను మరచిపోని తెలంగాణ బిడ్డలని ఆయన చెప్పారు.
పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో టిడిఎఫ్ వ్యవసాయ రంగంలో, ఆరోగ్య రంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు.
రాజకీయాలకు అతీతంగా, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) అధ్యక్షుడు దివేష్ అనిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన విద్య, వైద్య, ఉపాధి, వ్యవసాయ రంగ సేవలను అందించడానికి టీడీఎఫ్ ప్రతి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని, తమది లాభాపేక్షలేని స్వచ్చంద సంస్థ అని చెప్పారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో టిడిఎఫ్ పాత్ర విస్మరించలేనిదన్నారు. ఉద్యమ సమయంలో టీడీఎఫ్ని ఏర్పాటు చేసి, కీలకంగా పని చేశారని కొనియాడారు. మరికొందరు ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొన్నారు.
టిడిఎఫ్ పూర్వ అధ్యక్షురాలు కవిత చల్లా మాట్లాడుతూ.. దేశంకాని దేశంలో ఉంటున్నా కూడా నిరంతరం తెలంగాణ గుండె చప్పుడు వింటూ పుట్టిన గడ్డ కోసం టిడిఎఫ్ ఆధ్వర్యంలో నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మేము కొత్త సంవత్సరం ప్రారంభించిన వనిత చేయూత ప్రాజెక్టు కింద మగ్గం, కుట్టు మిషన్లు అందించి శిక్షణ ఇస్తూ మహిళల ఉపాధికి సహాయపడుతున్నాంమని, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో నేచురల్ ఫార్మింగ్, ఆరోగ్య సంరక్షణ, విద్య, కళలు, సంస్కృతి మరియు నీటి వనరుల వినియోగం వంటి అన్ని రంగాలతో టిడిఎఫ్ ప్రాజెక్టులను రూపొందించి అమలు చేస్తామని కవిత చల్లా తెలిపారు.
టిడిఎఫ్ బోర్డు సభ్యులు ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొన్నారు. బోర్డు సభ్యులతోపాటు ఛైర్మన్ వెంకట్ మారం, రాజ్ గడ్డం-కార్యదర్శి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనివాస్ మణికొండ, డా.గోపాల్ రెడ్డి, రామ్ కాకులవరం, వినోయ్ మేరెడ్డి, ప్రీతి జొన్నలగడ పాల్గొన్నారు.
టీడీఎఫ్ యూఎస్ఏ ఇండియా బృందం నాయకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ దివేష్ అనిరెడ్డి, టీడీఎఫ్ పూర్వ అధ్యక్షురాలు కవిత చల్లా, టీడీఎఫ్ ఇండియా చైర్మెన్ రణధీర్ బదం, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు వట్టే రాజరెడ్డి, ఉపాధ్యక్షుడు గోనా రెడ్డి, అడ్వైజర్ డీపీ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, జై కిషన్ చైర్ పటి నరేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మట్ట రాజేశ్వర్ రెడ్డి, జయింట్ సెక్రటరీ శివంత్ రెడ్డి, పీటీడీ కన్వీనర్ వినిల్ అడుదొడ్ల, పీటీడీ కో-కన్వినర్ అంజన త్రివేణి, స్కిల్ డెవలప్మెంట్ చైర్ శాంతి కుమార్ పుట్ట, రీజినల్ కో-ఆర్డినేటర్ సుశీల్ కొండ్ల, రీజినల్ కో-ఆర్డినేటర్ అమర్ కోమటిరెడ్డి, జై కిషన్ కో-ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ గజ్జుల తదితరులు పాల్గొన్నారు.













