న్యాయవాద దంపతుల హత్యపై… సుప్రీంలో
తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు విచారణలో ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. దేశవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే ఈ అంశం తెలంగాణ జ్యుడిషియరీ పరిధిలో ఉందని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సీజేఐ సూచించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల తర్వాత సుప్రీంను ఆశ్రయించవచ్చని తెలిపారు. సీజేఐ సూచన మేరకు యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ తన పిటిషన్ను ఉపసంహరించుకుంది.













