మూసీ నదికి శాంతి పూజ చేసిన మేయర్, మంత్రులు
హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా దంచికొట్టిన భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తిన విషయం విదితమే. మూసీకి వరద పోటెత్తడంతో.. నగర ప్రజలు అతలాకుతలమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూసీ ప్రవహించింది. దీంతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కష్టాలపాలయ్యారు. 1908లో మూసీ నదికి భారీ వరదలు రావడంతో.. నాటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు వందేళ్ల తర్వాత మళ్ళీ మూసీకి వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో వరదల నుంచి హైదరాబాద్ను గట్టెక్కించాలంటూ.. పురానాపూల్ వద్ద మూసీ నదికి బుధవారం హోంమంత్రి మహముద్ అలీ శాంతి పూజ చేశారు. గంగమ్మ తల్లికి బోనం, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. అక్కడున్న దర్గాలో మహముద్ అలీ చాదర్ సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.













