విద్యార్థులు పరిశోధనపై దృష్టి సారించాలి: గవర్నర్ తమిళిసై
ప్రపంచం కరోనాతో అతలాకుతలమవుతుంటే భారత్ ఈ వైరస్ను సమర్థంగా ఎదుర్కొందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. అందుకు కారణం వైద్యరంగంలో మనం తీసుకువచ్చిన ఆవిష్కరణలేనని పేర్కొన్నారు. తెలంగాణ ఫార్మా రంగానికి హబ్గా మారిందని మన దేశం ఈ రంగానికి క్యాపిటల్ మారిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు రూపొందించిన వైద్య పరికరాలను తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో తయారు చేసిన ఔషధాలు 150 దేశాలకుపైగా ఎగుమతి చేస్తున్నాని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం వ్యాక్సిన్లు, ఔషధాల కోసం మన దేశంవైపు చూస్తున్నాయని చెప్పారు. కరోనా ఇంకా పోలేదని విద్యార్థులంతా జాగురూకతతో వ్యవహరించాలని ఆమె కోరారు. పరిశోధకులు, విద్యార్థులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. మన జీవనశైలిలో రోజూ యోగాతో పాటు వ్యాయామాలు కూడా చేయాలని తెలిపారు. కరోనాతో రెండేళ్లుగా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు విశేషంగా సేవలందించారని గవర్నర్ కొనియాడారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు.













