ఎన్నికల బరిలో వైఎస్ షర్మిల, విజయమ్మ
కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో తెలంగాణలో బలం ఉన్న నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయాలని, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఆమె పాలేరు, మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. అలాగే తల్లి వైఎస్ విజయమ్మ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నియోజక వర్గాల వారీగా పలువురు అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. సూర్యాపేట నుంచి పిట్టం రాంరెడ్డి, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతికుమార్, ఆదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్, చేవెళ్ల నుంచి దయానంద్, గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేట నుంచి నర్సింహారెడ్డి, సిరిసిల్ల నుంచి చొక్కాల రాము, కామారెడ్డి నుంచి నీలం రమేశ్, అంబర్ పేట నుంచి గట్టు రామచంద్రరావులు బరిలో ఉండనున్నారు.













