రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు… వెయ్యి కోట్లు ఇచ్చి ఏమైనా
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీని చిల్లర మల్లర వేషాలకు వేదికగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్కు అసెంబ్లీలో కేసీఆర్ నివాళులు అర్పించలేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఎందుకు చర్చ జరపలేదని ఫైరయ్యారు. రాష్ట్రంలో వరదలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ గురించి అసెంబ్లీలో చర్చ జరగలేదు. కాంగ్రెస్పై కేసీఆర్ అభ్యంతరకరంగా మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చ జరపలేదు. నేను, కేసీఆర్ టీడీపీ నుంచే వచ్చామన్నారు.
1982లో ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ చంద్రబాబు చెప్పు చేతల్లో పెరిగారు. చంద్రబాబుకు అనుచరుడిగా కేసీఆర్ రాజకీయాల్లో పనిచేశారు. నేను తెలంగాణ కోసం నిఖార్సుగా కొట్లాడాను. పార్టీలు మారిని తెలంగాణ పక్షానే పనిచేశాను. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పిండం పెడతాం. కేసీఆర్కు రాజకీయ సమాధి తప్పదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చేవి 25 సీట్లే. అందుకే కాంగ్రెస్పై కేసీఆర్ దాడి చేస్తున్నారు. కేటీఆర్కు పరువు లేదు, బరువు లేదు. తెలంగాణలో డ్రగ్స్ కేసు విచారణపై మేము కోర్టుకు వెళ్లాం. పిల్ వేసి మేం డ్రగ్స్ కేసుపై పోరాడాము. డ్రగ్స్తో, రకుల్తో సంబంధం లేకుంటే కేటీఆర్ కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారు? వెయ్యి కోట్ల పరవు నష్టం అంటే వెయ్యి కోట్లు ఇచ్చి ఏమైనా అనొచ్చా? వెయ్యి కోట్లు ఇస్తే ఇష్టానుసారం తిట్టొచ్చా అని ప్రశ్నించారు.













