ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే.. ప్రభుత్వాధినేతగా నేను వస్తా

రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు చేసిన డిమాండ్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, ప్రభుత్వాధినేతగా తాను వస్తానని రేవంత్ తెలిపారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకురావాలన్నారు. మీరే తారీఖు డిసైడ్ చేయండి దీక్షకు మేం సిద్ధం. తెలంగాణకు నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామని సవాల్ విసిరారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చామని మేమెప్పుడూ పదే పదే చెప్పలేదు. రూ.100 పెట్టి పెట్రోల్ కొన్నారు కానీ, అగ్గిపెట్టి కొనలేదు. అగ్గిపెట్టి మర్చిపోయినట్టు నటించి అమాయక విద్యార్థులను బలిగొనలేదు అని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయంపై శాసనసభలో చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది.