హైదరాబాద్ లో కూర్చుంటే.. ఢిల్లీ చుట్టూ తిరిగితే రావు
హైదరాబాద్లో కూర్చుంటే, ఢిల్లీ చుట్టూ తిరిగితే టికెట్లు రావు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు. గాంధీభవన్లో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. మెరిట్ ఆధారంగా వచ్చే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్నారు. ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేసే వారికే టికెట్ ఇస్తాం. ఎంతటి సీనియర్లు అయినా సరే పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్ మాత్రం దక్కదు అన్నారు. టికెట్ దక్కాలంటే హైదరాబాద్ను వదిలి గ్రామాల్లోకి వెళ్లాలి. వెనుక డోర్ ద్వారా ప్రయత్నించే వారు ఆశలు వదులుకోవాలన్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి సర్వే చేసి టికెట్లు కేటాయిస్తాం. వరంగల్ డిక్లరేషన్ గురించి ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు వివరించాలి. వరంగల్ డిక్లరేషన్ గురించి చిన్న పిల్లలకు కూడా తెలియాలి. వరంగల్లో చెప్పింది డిక్లరేషన్ మాత్రమే కాదు ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఉన్న ఒప్పందమన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య యుద్ధం ఉంటుందని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వెనక ధనం, పోలీసులు ఉన్నప్పటికీ ప్రజలు లేరన్నారు. తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. నేతల కృషి వల్ల వరంగల్ సభ దిగ్విజయం అయిందని, ఇందుకోసం ప్రతి ఒక్కరికీ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పాలి. మీడియా ముందు మాత్రం చెప్పొదు. ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం కానీ, మీడియా ముందుకు మాత్రం వద్దన్నారు. కాంగ్రెస్పై గౌరవం ఉన్న కార్యకర్తలు కోట్ల మంది ఉన్నారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా అరాచక పాలన కొనసాగుతోంది. ఎన్నో ఆశయాలతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఇన్నేళ్లలో ప్రజలు, సోనియా గాంధీ అనుకున్నది రాష్ట్రంలో జరగలేదన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. మన ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గెలవాలి అని పిలుపునిచ్చారు.













