తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : రాహుల్ గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది, కచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన బస్సు యాత్రలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒంటరి కాదని, బీజేపీ, ఎంఐఎం వారితో కలిసే ఉంటాయని విమర్శించారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను కాబట్టే ఎన్నో కేసులు పెట్టారన్నారు. నా సభ్యత్వాన్ని లాకున్నారు, నా ఇంటిని లాకున్నారు. మీ ముఖ్యమంత్రి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అందుకే ఆయన వెంట సీబీఐ, ఈడీలు వెంటపడవు. ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పాల్గొని బీజేపీకి సహాయ పడుతోందన్నారు.
బీజేపీతో పోరాడుతున్నానని నా డీఎన్ఏ నిరంతరం గుర్తు చేస్తోంది. బీజేపీకి మద్దతు ఇచ్చే వారు నాపై విమర్శలు గుప్పిస్తుంటే నా పోరాటం సవ్యంగా సాగుతోందని అర్థం అవుతోంది. అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రజల పాలన ఏర్పడటం ఖాయం. పార్లమెంట్లో ఓబీసీ జనాభా ఎంత అని నిలదీశా. దేశాన్ని 90 మంది అధికారులు పరిపాలిస్తున్నారు. అందులో ఓబీసీలు కేవలం ముగ్గురే. అందుకే దేశానికి ఎక్స్రే అవసరమని చెబుతున్నా. డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఏ రోగమో తెలియాలంటే ఎక్స్రే తీసుకు రమ్మంటారు. మా ప్రభుత్వం రాగానే ముందుగా ఎక్స్రే (కులగణన) తీయించే పని చేస్తాం అని అన్నారు.













