Project Shakti: కలెక్టర్ హరిచందన దాసరి చేతుల మీదుగా ప్రాజెక్ట్ శక్తి ప్రారంభం
7,000 మంది విద్యార్థినులకు రూ.35 లక్షల విలువైన పునర్వినియోగ సానిటరీ ప్యాడ్ల పంపిణీ
మహిళల మాసిక ఆరోగ్యం మరియు సాధికారత దిశగా కీలకమైన ముందడుగుగా, రోటేరియన్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరియు యూనిప్యాడ్స్ ఫౌండేషన్ సంయుక్తంగా “ప్రాజెక్ట్ శక్తి ” అనే సమయోచితమైన, ప్రభావవంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 60,000 మంది బాలిక విద్యార్థినులకు పునర్వినియోగ సానిటరీ ప్యాడ్ల అందించి వారిని సాధికారత వైపు నడిపించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రతి రీయూజబుల్ శానిటరీ ప్యాడ్ కిట్లో మూడు ప్యాడ్లు ఉంటాయి. సరైన సంరక్షణతో వీటిని సుమారు 12 నుంచి 16 నెలల వరకు ఉపయోగించవచ్చు. వాడే వస్త్రపు నాణ్యత, వినియోగం తరచుదనం, కడగడం మరియు ఎండబెట్టే విధానం వంటి అంశాలపై వీటి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. సరైన సంరక్షణతో ఇవి అనేక మాసిక చక్రాలపాటు సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఉపయోగపడతాయి.
రూ.2.5 కోట్ల మొత్తం వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన దాసరి, ఐఏఎస్, కోటి లోని వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని విద్యార్థినులకు రూ.35 లక్షల విలువైన 7,000 రీయూజబుల్ శానిటరీ ప్యాడ్ కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ పంపిణీ మార్చి 2026 నాటికి పూర్తి చేయనున్న 60,000 మంది విద్యార్థినులను కవర్ చేసే విస్తృత కార్యక్రమంలో భాగంగా జరుగుతోంది.
సభను ఉద్దేశించి మాట్లాడిన కలెక్టర్, విద్యార్థినులు ఋతుస్రవ సమస్యలనుండి స్వేచ్ఛ పొందండి (మెన్స్ట్రువల్ ఇండిపెండెంట్) గా మారాలని పిలుపునిచ్చారు. మాసిక ధర్మం విషయంలో నియంత్రణ, ఎంపిక, గౌరవం అవసరమని, ఎలాంటి అవమానం, అడ్డంకులు లేదా ఆధారపడటం లేకుండా ఉండాలని ఆమె పేర్కొన్నారు. మాసిక ఆధారపడటం వల్ల విద్యాభంగం, అవకాశాల నష్టం, ఆరోగ్య ప్రమాదాలు మరియు సామాజిక అపహాస్యం ఎదురయ్యే అవకాశం ఉందని, మెన్స్ట్రువల్ ఇండిపెండెన్స్ అనేది శరీర స్వాతంత్ర్యం మరియు సమానత్వానికి ప్రతీక అని ఆమె అన్నారు.
రీయూజబుల్ శానిటరీ ప్యాడ్ల ప్రయోజనాలను వివరించిన కలెక్టర్, ఇవి తక్కువ ఖర్చుతో కూడినవి, పర్యావరణహితమైనవి, కడిగి మళ్లీ ఉపయోగించుకునే విధమైనవి మరియు శరీరానికి మృదువుగా ఉంటాయని చెప్పారు. వ్యర్థాలను తగ్గించడంతో పాటు చర్మ అలర్జీలను తగ్గిస్తూ దీర్ఘకాలిక మాసిక గౌరవాన్ని కల్పిస్తాయని తెలిపారు.
మహిళలు తమ పునరుత్పత్తి వయస్సు/ జీవితమంతా నాణ్యమైన మాసిక ఉత్పత్తులను వినియోగించాలని, నేటి కాలంలో రీయూజబుల్ ప్యాడ్లు ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ సవాళ్లను స్వీకరించి మార్పుకు దోహదపడే నాయకులుగా ఎదగాలని కలెక్టర్ ప్రోత్సహించారు. భారత సుప్రీంకోర్టు మాసిక పరిశుభ్రతను రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కులో భాగంగా గుర్తించిందని, గౌరవప్రదమైన మాసిక నిర్వహణను నిర్ధారించడం రాష్ట్ర బాధ్యత అని ఆమె గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన మహిళా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, మాసిక పరిశుభ్రత మహిళలకు ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛను అందిస్తుందని, విద్య, ఉద్యోగం మరియు దైనందిన జీవితంలో ఎలాంటి భయం లేకుండా సంపూర్ణంగా పాల్గొనడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.
రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ ఎస్.వి. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజారోగ్యంలో రోటరీకి గొప్ప చరిత్ర ఉందని, ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం సుమారు రూ.25,000 కోట్లు వెచ్చించి రోటేరియన్లు సాధించిన విజయం సమిష్టి కృషి శక్తిని చూపుతుందని అన్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ అధ్యక్షుడు గోవింద్ పుట్టా మాట్లాడుతూ, తమ క్లబ్ ద్వారా వివిధ సంస్థల్లో 360 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ శక్తి ద్వారా 2,000కు పైగా పాఠశాలల్లో సుమారు 60,000 మంది బాలికలు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. అలాగే వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.45 లక్షల వ్యయంతో సైన్స్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
రోటేరియన్ సీవీ సుబ్బారావు మాట్లాడుతూ, ప్రాజెక్ట్ శక్తిని రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ (RID 3150) ఆధ్వర్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూనిప్యాడ్స్ ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ మరియు పెద్దపల్లి జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో సాగుతోందని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా పాఠశాలలకు హాజరు లోటును తగ్గించడం, మాసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, దశలవారీగా పంపిణీతో పాటు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా స్థిరమైన పరిశుభ్రత పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.






