ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసిన తెలంగాణ సర్కార్

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 60 రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై నివేదికను సమర్పించాలని ఈ కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీల వెనుకబాటుతనాన్ని ఉపకులాల వారీగా ఈ ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేయనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పలు పర్యాయాలు సమావేశమైన ఈ కమిటీ.. ఎస్సీ రిజర్వ్డ్ కులాల వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.